సీమాంధ్ర సారధి(వైద్యం): పక్షవాతం.. మనిషి కదలికలను మార్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మంచానికి పరిమితం చేస్తుంది. మెదడులో రక్తస్రావం కావటం (హెమరేజిక్) వల్లే వచ్చే పక్షవాతం(Paralysis) మరీ తీవ్రమైన సమస్య. దీని బారినపడ్డవారిలో 50% వరకూ మరణిస్తుంటారు. 30% మందిని తీవ్ర వైకల్యం వేధిస్తుంది. కేవలం 20% మందే ఏడాది తర్వాత తమ పనులు తాము చేసుకునే స్థితికి చేరుకుంటారు. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే మద్యం జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అసలే తాగని లేదా కొద్దిగా తాగేవారితో పోలిస్తే అతిగా మద్యం తాగేవారికి 11 ఏళ్లు ముందుగానే మెదడులో రక్తస్రావంతో ముడిపడిన పక్షవాతం ముంచుకొస్తున్నట్టు బయటపడింది. కొద్దిగా మద్యం తాగేవారు సగటున 75 ఏళ్ల వయసులో పక్షవాతం బారినపడితే.. అతిగా తాగేవారు సగటున 64 ఏళ్ల వయసులోనే దీనికి గురవుతున్నారని తేలింది. హెమరేజిక్ పక్షవాతంతో ఆసుపత్రి పాలైన 1,600 మందిని పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. మద్యం జోలికి వెళ్లకపోవటం, అలవాటుంటే తగ్గించుకోవటం మంచిదని ఈ అధ్యయన ఫలితాల సారాంశం.
అసలు పక్షవాతం రావడానికి కారణాలేంటి?
పక్షవాతం రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మెదడు రక్తస్రావం, అంటే మెదడుకు వెళ్లే రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడటం. రెండోది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పైపులో ఒక రకమైన అడ్డంకి. చాలా సందర్భాలలో రక్త ప్రసరణలో అడ్డంకుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. నివేదికల ప్రకారం, 85 శాతం పక్షవాతం కేసులు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనుల్లో బ్లాక్ ఏర్పడటం వల్లే సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
సాధారణంగా పక్షవాతం చేతులు, కాళ్లు, నోటిని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఒక వైపు తీవ్ర ప్రభావం ఉంటుంది. ఒక వైపు శరీర భాగాలు పనిచేయడం మానేస్తాయి. నడవడం, మాట్లాడటం, వ్రాయడం, శరీరాన్ని కదిలించడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారికి చాలా బలహీనతలు ఉంటాయి. పక్షవాతం వచ్చే ముందు కంటి చూపు మందగిస్తుంది. పక్షవాతం వచ్చే ముందు నిలబడటం, నడవడంలో ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలాంటి వ్యక్తుల్ని వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలి.
